Banner
Watermark
చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి -ఇన్ఫీ నారాయణమూర్తి
📅 18 November 2025 ✍️ REPUBLIC HINDUSTAN
News Image


న్యూఢిల్లీ,నవంబర్ 18 :
ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 72 గంటలు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా చైనాలో ప్రసిద్ధి చెందిన 9-9-6 రూల్‌ను ఉదాహరణగా చెప్పారు.ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన మూర్తి.. చైనా ఆర్థిక వ్యవస్థను ఎదుర్కోవాలంటే యువత మరింత కష్టపడి పనిచేయాలన్నారు. ‘చైనాలో 9-9-6 అనే పాలసీ ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా..? ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ వారానికి 6 రోజులు పనిచేయడం. మొత్తం 72 గంటలు పనిచేయడం’ అని అన్నారు. భారతీయ యువత ఈ పనిగంటలను అనుసరించాలని వ్యాఖ్యానించారు. ముందు యువత తమ కెరీర్ నిర్మించుకోవడంపై దృష్టిపెట్టాలని తర్వాతే వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌ గురించి ఆలోచించాలని సూచించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.కాగా, ఆర్ధిక వ్యవ‌స్ధ ఉర‌క‌లెత్తేందుకు, ఉత్పాద‌క‌త పెరిగి మ‌నం అగ్ర దేశాల‌తో పోటీ ప‌డాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే ఉత్పాదకత అతి తక్కువ. ఉత్పత్తిలో మన పని మెరుగు పర్చుకోలేకపోయినా, ప్రభుత్వంలో కొంత స్థాయి వరకూ అవినీతి తగ్గించకపోయినా.. అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలతో మనం పోటీ పడలేం’ అని నారాయణ మూర్తి స్పష్టం చేశారు.

‘నా యువతరానికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే.. ‘ఇది నా దేశం. నా దేశం కోసం నేను వారానికి 70 గంటలు పని చేస్తాను’ అని తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయాలి` అని నారాయణ మూర్తి చెప్పారు. అయితే, ఆయన వ్యాఖ్య‌లు వివాదాస్పద‌మ‌య్యాయి.

ఇంత సుదీర్ఘ గంట‌లు ప‌నిచేస్తే మాన‌సిక ఆరోగ్యంపై ప్ర‌భావం చూప‌డంతో పాటు ప‌ని-జీవితం మ‌ధ్య స‌మ‌తూకం దెబ్బ‌తింటుంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.
🏠 Home