• Other News
  • Live TV
  • పాకిస్థాన్‌కి ఆర్మీ చీఫ్ గట్టి హెచ్చరిక

    పాకిస్థాన్‌కి ఆర్మీ చీఫ్ గట్టి హెచ్చరిక

    - ఉగ్రవాదానికి మద్దతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు
    - ఉగ్రవాదులు – వారికి మద్దతిచ్చేవారు ఒకటే అని స్పష్టం
    - ఆపరేషన్ సిందూర్‌లో 88 గంటల ట్రైలర్ చూపించాం – పూర్తి సినిమా సిద్ధం
    - చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నాయని ఆర్మీ చీఫ్ వ్యాఖ్య

    న్యూఢిల్లీ, నవంబర్ 17 :
    భారత్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ మద్దతు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత సైన్యాధిపతి ఉపేంద్ర కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదులను, వారికి మద్దతిచ్చేవారిని భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన ప్రతిస్పందన ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

    పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, ఉగ్ర ముఠాలకు సహాయం చేసే ధోరణి కొనసాగితే పాకిస్థాన్ అస్థిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దేశ ప్రజల శ్రేయస్సు, పురోగతిని కాపాడే దిశగా భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని, అడ్డంకులు సృష్టించేవారిని కఠినంగా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ, “పాకిస్థాన్‌కు 88 గంటల ట్రైలర్ చూపించాం… ఇక అవసరమైతే పూర్తి సినిమా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సందర్భంగా పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ఆధారాలను ప్రపంచానికి అందించామని ఆయన తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి చర్చలు, రాజీ లాంటివి అసాధ్యమని, “రక్తం – నీరు ఎప్పటికీ కలిసి ప్రవహించవు” అంటూ పాకిస్థాన్‌పై మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. బ్లాక్‌మెయిల్ ప్రయత్నాలకు భారత్ లోబడదని, శత్రు దేశాలను ఎదుర్కోవడంలో దేశ నేతలందరూ ఏకతాటిపై పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ & కశ్మీర్‌లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని వివరించారు.

    చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ, ఇంతకుముందు కంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు సానుకూల దిశగా సాగుతున్నాయని ఉపేంద్ర ద్వివేది తెలిపారు. సరిహద్దు నిర్వహణపై ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశాలు ఇరుదేశాల మధ్య అవగాహన పెంపుకు దోహదపడుతున్నాయని, శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

    📰 e-Paper Clip