- నేపాల్ నుంచి ఫోన్లు, కాన్పూర్ నుంచి సిమ్కార్డులు
- కుట్రదారులు కొనుగోలు చేసిన 7 సెకండ్హ్యాండ్ ఫోన్లు బయటకు
- కాన్పూర్ అడ్రెస్తో తీసుకున్న 17 సిమ్ కార్డులు దర్యాప్తును మళ్లించిన దిశ
- వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్పై దృష్టి : పలువురు వైద్యులపై విచారణ
న్యూఢిల్లీ, నవంబర్ 17 :
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తు వేగం పెరుగుతోంది. ఈ దాడికి సంబంధించి కీలక ఆధారాలను అధికారులు వరుసగా బయటకు తీసుకొస్తున్నారు. విచారణలో భారీ సంచలనం కలిగించే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుళ్ల కుట్రదారులు నేపాల్లో కొనుగోలు చేసిన సెకండ్హ్యాండ్ ఫోన్లు మరియు కాన్పూర్లో పొందిన సిమ్ కార్డులు ఉపయోగించినట్లు దర్యాప్తు నిర్ధారించింది. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులు నేపాల్లో మొత్తం 7 సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశారు. ఈ పరికరాల ద్వారా కట్టుబడి పని చేసే టెర్రర్ మాడ్యూల్ మధ్య కమ్యూనికేషన్ జరిగిందని అనుమానిస్తున్నారు. అలాగే 17 సిమ్ కార్డులను ఉపయోగించినట్లు గుర్తించబడింది. అందులో 6 సిమ్ కార్డులు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ బెకాన్గంజ్ అడ్రెస్ తో తీసుకున్నవేనని పరిశోధన చెబుతోంది. సిమ్ కార్డులకు ఇచ్చిన చిరునామాలు, ఐడెంటిటీ ప్రూఫ్లు, ఫోన్ యాక్టివేషన్ డేటా ఆధారంగా భద్రతా సంస్థలు దర్యాప్తు మరింత విస్తరించాయి. ఇప్పటికే వాయిస్ రికార్డులు, లొకేషన్ ట్రైల్స్, డిజిటల్ కమ్యూనికేషన్పై స్పెషల్ టీమ్ తమ దృష్టి సారించినట్లు సమాచారం. ఇక వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కదిలిన సంగతి తెలిసిందే. అరెస్టులో ఉన్న డాక్టర్ పర్వేజ్ బావమరిది ఉస్మాన్ బెకాన్గంజ్లో బట్టల దుకాణం నడుపుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ స్పెషల్ సెల్ అతన్ని ఆరు గంటల పాటు విచారించినా పెద్దగా సమాచారం రాలేదని తెలిసింది. డాక్టర్ పర్వేజ్ ఇటీవల కాన్పూర్కు వెళ్లి, కల్నల్గంజ్, జీఎస్వీఎం మెడికల్ కాలేజ్, బాబుపూర్వా, మంధానా ప్రాంతాల్లోని స్నేహితులను కలిసినట్లు విచారణలో తేలింది. పేలుళ్ల మాస్టర్మైండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న లేడీ డాక్టర్ షాహీన్ కూడా ఈ ఏడాది అక్టోబర్లో కాన్పూర్ వెళ్లినట్లు అధికారులు ఆరా తీశారు. ఆమె ఎవరిని కలిసింది? ఎవరి నుంచి సహాయం అందుకుంది? ఈ ప్రశ్నలపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. ఢిల్లీ పేలుడుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.